చిత్రం న్యూస్, బాసర:వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని డీఎల్పీఓ లక్ష్మణ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర రైతు వేదికలో పది గ్రామపంచాయతీలకు చెందిన నూతనంగా ఎన్నికైన 90 మంది వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి డీఎల్పీఓ లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టం, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామాభివృద్ధి, గ్రామ సభల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ, నిధుల వినియోగం వంటి అంశాలపై వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా సింగ్, ఈఓ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




