నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సేవా దృక్పథంతో పనిచేస్తూ రోగుల ప్రాణాలు కాపాడే నర్సులు, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవ’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం నర్సులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, రోగుల కోలుకోవడంలో వారి సేవలు అత్యంత కీలకమని కొనియాడారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు నర్సులను కలెక్టర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకల్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరిండెంట్లు కల్పన, రమాదేవి, ఉమతో పాటు ఇతర వైద్య అధికారులు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

