కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల రాస్తారోకో
చిత్రం న్యూస్, దండేపల్లి : వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండలంలో సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యాసంగి పంట కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కష్టంగా మారిందని, మార్కెట్లో సరైన ధరలు లభించక నష్టపోతున్నామని తెలిపారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

