అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని తిమ్మాపూర్, గొల్లమాడ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తిమ్మాపూర్ గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా గొల్లమాడ గ్రామంలో 24 లక్షల రూపాయల నిధులతో చెరువు మరమత్తు పనులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విద్య, వైద్యం, సాగునీరు అందించడమే లక్ష్యంగా తాను ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నానని, 28 ప్యాకేజీ పై పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ప్యాకేజీ పూర్తయితే కుంటాల నర్సాపూర్ మండలాలకు 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.. తను శాసన సభ్యునిగా ఎన్నికైనప్పటినుంచి శాసనసభలో సమస్యలపై పలుమార్లు మాట్లాడడం జరిగిందని, అధికార పార్టీలో లేకున్నా అందరి సహకారంతో ప్రతి ఏట నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత పది సంవత్సరాల కాలంలో లేని విధంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి రూ.25 కోట్ల నిధులు, ముథోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రూ.220 కోట్ల నిధులు ఒకేసారి మంజూరు కావడం సంతోషకరమన్నారు. గతంలో లేని విధంగా తన హయంలో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. గొల్లమడ చెరువు ప్రధాన కాలువ సీసీ లైనింగ్ కు నిధులు మంజూరు చేయిస్తానని, అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పారు. వ్యాపారుల దోపిడీని అరికట్టేందుకు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు గతంలో లేని విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దశల వారిగా సబ్ సెంటర్లను పెంచనున్నట్లు చెప్పారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.




