బాసరలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అక్షయ తృతీయ పురస్కరించుకుని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అమ్మవారికి వైదిక బృందం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. బంగారు లక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక నామస్మరణతో మార్మోగింది. అక్షయ తృతీయ రోజున గురుపూజోత్సవం సకల శుభాలను ఇస్తుందని, మంత్ర అనుష్టానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వైదికులు వెల్లడించారు. అయితే భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని ఆలయ ఏఈఓ శ్రీనివాస్ వెల్లడించారు.

