-Advertisement-

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

* కాలనీవాసుల కష్టాలపై అదనపు కలెక్టర్ హామీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ (సర్వే నంబర్ 170) నివాసితులు గత 12 ఏళ్లుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పట్టాలు పొందిన సుమారు 200 కుటుంబాలకు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్ కు ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఎండకాలం వస్తున్నా పేద ప్రజల దాహం తీర్చలేని ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎందుకని ఆయన నిలదీశారు. గతంలో జిల్లా కలెక్టర్ రూ.5 లక్షలు మంజూరు చేయడంతో నీటి ట్యాంకులు, పైపులు, బోర్ వెల్ ఏర్పాటు చేశారని.. కేవలం రూ. 2.5 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన గుర్తు చేశారు.

మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు వివరించగా, ప్రజల ప్రాథమిక అవసరాల కంటే నిధులు ముఖ్యం కాదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్, త్వరలోనే రెండు లక్షల రూపాయలు చెల్లించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ధర్నా సద్దుమణిగింది.

ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామిలే రామదాస్, గిరిజన సంఘం జిల్లా నాయకులు కొడప సురేష్,  కాలనీవాసులు తారాబాయి, శాంతాబాయి, జంగు భాయ్, ముల్కల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments