చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డులో సోమవారం ‘ఇంటింటికి సీపీఐ ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరిస్తూనే, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, “ప్రజల కోసం మీరు చేసే పోరాటాలకు ఎన్ని విరాళాలు ఇచ్చినా తక్కువే” అంటూ మద్దతు తెలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్.అరుణ్ కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామదాస్, గిరిజన సంఘం నాయకులు కొడప సురేష్, శాంతన్ కుమార్, సోను బాయ్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్,నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మండల స్థాయి సభలను విజయవంతం చేయాలి : కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని, అదే స్పూర్తితో మండల స్థాయి సభలను కూడా సమర్ధవంతంగా జరిగేలా చూడాలన్నారు. మండల సభ నిర్వహణ సమయానికి ముందే ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్ లు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో అందిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. , జనాభా గణన అన్ని మున్సిపల్ పట్టణాలు, మండలాలు, క్షేత్రస్థాయిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారీగా ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్లను, ఆర్డీఓను ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియకు విద్యాశాఖ పూర్తి సహకారం అందించేలా చూడాలని, ఈ విషయంలో ఎవరైనా నిరాకరిస్తే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను విరివిగా సందర్శిస్తూ, విద్యార్థులు వసతి, సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దేవస్థానం, ఆలయ చుట్టుపక్కల అభివృద్ధి పనులకు రూ.225 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
దేవాలయ ప్రాంగణం 20 వేల చదరపు అడుగుల నుంచి 60 వేల చదరపు అడుగుల వరకు పెరగనుంది. అమ్మవారి ఆలయంలో తొమ్మిది అంతస్థుల రాజగోపురం, ఈశాన్యంలో కోనేరు నిర్మాణం చేయనున్నారు. మూడు రెట్లు పెరగనున్న బాసర దేవాలయ విస్తీర్ణం శృంగేరి పీఠాధిపతుల అనుమతితో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇప్పటికే బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు. ప్రస్తుతం 2వేల చదరపు అడుగుల్లో గర్భాలయం ఉందని, నాలుగు దిక్కుల్లో మాడ వీధుల్ని నిర్మించనున్నారు. సీఎం రాకతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్, వెడ్మ బొజ్జు, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హన్మంత్ రావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏనుగు శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా నేతల సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ గా నియమితులైన ఏనుగు శ్రీనివాస్ రెడ్డిని ఇచ్చోడ, గ్రామస్తులు, నేతలు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహనికి వెళ్లిన నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఏనుగు మోహన్ రెడ్డి ఇచ్చోడ రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు మోహన్ రెడ్డి, హనుమాన్ సాయి టెంపుల్ చైర్మన్ గూడూరు ముత్యంరెడ్డి,నాయకులు తుమ్మల రాజేశ్వర్ రెడ్డి, ఏనుగు విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాసర అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసరలోని పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో విజయ రామారావు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి , దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడు రియాన్స్ కు అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు.
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోనోత్సవం: గ్రామ గ్రామాన ఎగిరిన కాషాయ జెండా
చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా జైనథ్, మాకోడ, సాంగ్వి (కె), కరంజి (కె) గ్రామాల్లో నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు
జైనథ్ మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు చిల్కూరి లింగారెడ్డి, వార్డు సభ్యులు లక్కం అనిల్, కోడిచర్ల స్వామి, చౌదరి పరశురాం, శాలిక్ రావ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మాకోడ గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, సోంరెడ్డి ఉషన్న, మచ్చ సంతోష్, బీజేపి జైనథ్ మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు దివ్ పలువురు బీజేపి నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సవంగా జరిపారు.
కరంజి (కె) గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. బూత్ నూతన అధ్యక్షులు సామ నర్సింగ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, పోచ్చన్న , సూర్య, మహేందర్ రెడ్డి, సచిన్ తదితరుల పాల్గొన్నారు.
సాంగ్వి (కె) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంగ్వి గ్రామంలో బిజెపి నాయకులు పోచ్చిరాం, తరుణ్ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలని కోరారు.
దీపాయిగూడలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఆవిష్కరించిన లోక కరుణాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జైనథ్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని దీపాయిగూడ గ్రామంలో బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి తన స్వగ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించడం వెనుక లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువత క్రీడలవైపు దృష్టి సారించాలి
*కేశాపూర్ లో గ్రౌండ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : యువత తమ సమయాన్ని ఫోన్లో కాకుండా మైదానంలో గడపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కేశాపూర్ లో వైద్యులు అభినవ్, కిరణ్ కుమార్, చైతన్య కుమార్, ప్రశాంత్ రెడ్డి లు ఏర్పాటు చేసిన రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కేవలం వైద్యమే కాకుండా యువత కోసం క్రికెట్ మైదానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అయితే ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేకవడం క్రీడాకారులకు శాపంగా మారిందనన్నారు. జిల్లాలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో ఆయా క్రీడా అంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా..జిల్లాలో మాత్రం స్టేడియం లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే తాను స్టేడియం విషయం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. అలాగే యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు. అలాగే అన్ని పార్టీల నాయకులు కలిసి కట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, నగర మేయర్ ఉమారాణి, డీసీపీ బస్వారెడ్డి, కేశాపూర్ సర్పంచ్ గంగాధర్, డాక్టర్ మోతీలాల్, బీజేపీ కార్పొరేటర్ లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జానకీ షర్మిల
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం బాసర ఈఓ కార్యాలయంలో భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు అందించారు. ప్రతి అధికారి తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈఓ విజయరామారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో బాసరలో మహాయజ్ఞం
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా, ఆయన రాక విజయవంతం కావాలని కోరుతూ నాగభూషణం స్కూల్ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










