చిత్రం న్యూస్, బేల: మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జీవామృత కేంద్రాన్ని జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య, మండల అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ లను ఏర్పాటు చేసి అందులో లభించే పోషకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ప్రోగ్రామ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడకంతో భూమి యొక్క సారవంతం తగ్గిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతుందన్నారు.రసాయనిక ఎరువులు వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.జీవామృతం వంటి మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడం, రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించడం, విషరహిత ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి దోహదపడతుందన్నారు.

