బీజేపీలో చేరిన మాజీ ఎంపీటీసీ రేణుకాబాయి కి పార్టీ కండువా కప్పుతున్నా ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సుమారు రెండు ఏళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ను అప్పుల కుప్పగా మారుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాత్నాల మండలం జామిని గ్రామ మాజీ ఎంపీటీసీ రేణుక బాయి తో పాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు, సిసి రోడ్లు, పానాది రోడ్ల నిర్మాణాలు, చివరికి శ్మశానవాటికల నిర్మాణాలు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు చేరడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చే అభ్యర్థులను గెలిపించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో పాటు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు. గ్రామస్థులు పాల్గొన్నారు.

