*జిల్లాలో 20 మంది సిబ్బందితో పటిష్టంగా విపత్తు నిర్వహణ బృందం
*వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందం
*సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులతో శిక్షణలో పాల్గొని సిబ్బందికి సూచన
*అత్యాధునిక పరికరాలకు పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
చిత్రం న్యూస్, సాత్నాల: రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టితో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఒకవేళ చోటు చేసుకున్న ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి జిల్లా విపత్తు నిర్వహణ బృందం (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ) 20 మంది పోలీసు సిబ్బందితో పక్కా ప్రణాళికతో పటిష్టంగా ఉందని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు వద్ద జిల్లా పోలీసు అధికారులు, విపత్తు నిర్వహణ బృందంతో జిల్లా ఎస్పీ ఆధునిక పరికరాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
బోటులో ప్రయాణించి శిక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు ఇచ్చి అత్యవసర సమయంలో వెంటనే స్పందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ విపత్తు నిర్వహణ బృందం జిల్లాలో ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో 20 మంది పోలీసు సిబ్బందితో శిక్షణ పూర్తి అయి, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తమదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రజలకు “పోలీసులు మీకు ఉన్నాం అంటూ” రక్షణ కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఇల్లు కూలిపోయిన సందర్భంలో ఎలాంటి తుఫానులు, సుడిగాలులు సంభవించిన రోడ్డు స్తంభించిపోయినప్పుడు చెట్లు విరిగిపడ్డప్పుడు ఈ బృందం ఆస్తి నష్టం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలను చేపడుతుందని తెలిపారు. ఈ డీ డీ ఆర్ ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్స్ మిషన్ లాంటివి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్ట, ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా పోలీసుల ద్వారా ప్రత్యేకంగా ఈ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ బృందం హైదరాబాద్ నందు వారం రోజులు పాటు శిక్షణ తీసుకొని అత్యవసరంగా స్పందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు డి.సాయి నాథ్, కె.ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్, డీ డీ ఆర్ఎఫ్ బృంద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.