ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి
*ఇప్పటివరకూ 25,397 ఎస్జీటీల బదిలీ.
చిత్రం న్యూస్, అమరావతి: సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పటివరకూ 11 జిల్లాల్లో బదిలీలు పూర్తికాగా మరో రెండు జిల్లాల్లో ఆదివారం పూర్తవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. పశ్చిమగోదావరి, కృష్ణా, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం రాత్రితో బదిలీలు పూర్తయ్యాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నేడు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 31,072 మంది బదిలీలో ఉండగా శనివారం సాయంత్రానికి 25,397 మంది బదిలీ అయ్యారు. కాగా బదిలీలు పూర్తయినవారు సోమవారం కొత్త పాఠశాలలో చేరేవిధంగా వెంటనే బదిలీల ఆర్డర్లు సిద్ధంచేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించినా, ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టారు.