ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి
*సైదాపూర్ మండల ఆటో కార్మికుల ఆవేదన
చిత్రం న్యూస్, సైదాపూర్:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సైదాపూర్ మండల ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయలేకపోయిందని కార్మికులు ఆరోపించారు. ఈ వైఫల్యం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వారు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఆటో కార్మికులైన పొడిశెట్టి నరేష్, పిల్లి నరేష్, గడ్డం శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత బస్సు పథకం వంటి విధానాలతో తమ ఉపాధిని కోల్పోయేలా చేసిందని, హామీ ఇచ్చిన ఆర్థిక సాయం అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వాపోయారు. మా బతుకులు గాడినపడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి, హామీ ఇచ్చిన రూ.12,000 సాయాన్ని అందించాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల హామీలను నెరవేర్చి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆటో కార్మిక సంఘాలు కోరుతున్నాయి.