చిన్న కార్యకర్త నుంచి పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా లింగంపల్లి నర్సింలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవలు అందించిన లింగంపల్లి నర్సింలుకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కింది. ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. పట్టణంలోని ద్వారక నగర్ కాలనీకి చెందిన లింగంపల్లి నర్సింలు, నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఆయన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా చేరి సుదీర్ఘకాలం పాటు ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేశారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని, నమ్మకాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాజాగా ఆయనను పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఒక చిన్న స్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, ఈరోజు పట్టణ స్థాయి కీలక పదవికి ఎదగడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ద్వారక నగర్ కాలనీ ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నర్సింలు నియామకం.. కష్టపడి పనిచేసే ప్రతి సాధారణ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించిందని వారు కొనియాడారు. ఆయన నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ శ్రేణులు నర్సింలుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
