అడిషనల్ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వారెడ్డికి సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. బస్వారెడ్డి గతంలో జిల్లాలోనే ఎస్సైగా పనిచేశారని..అనంతరం సీఐగా, ఏసీపీగా పదోన్నతి పొంది సేవలందించారన్నారు. అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తూ తాజాగా చీఫ్ ఆఫీస్కు బదిలీ అయ్యారన్నారు. మృదు స్వభావిగా పేరున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డా. కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ, కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్ తదితరులు హాజరై బస్వారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, అభిమానులు సీపీ కార్యాలయానికి వచ్చి బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్ నియమితులయ్యారు.




