ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం:‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకావిష్కరణ
చిత్రం న్యూస్, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మృతివనంలో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై అమరులకు ఘన నివాళులర్పించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్, ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమరవీరుల స్తూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి, స్తూపానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
పుస్తకావిష్కరణ:
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్రం భుజేంద్రరావు రచించిన “ఆ గాయానికి 44 ఏళ్లు” అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఇంద్రవెల్లి ఘటన తాలూకు చారిత్రక నేపథ్యాన్ని, ఆనాటి జ్ఞాపకాలను ఈ పుస్తకం గుర్తు చేస్తోందని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, ఆసిఫాబాద్ ,అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం సుగుణ, నరేష్ జాదవ్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడీలు, పటేళ్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్మృతివనం జనసంద్రంగా మారింది.

