ఆదిలాబాద్ కంది రైతులకు ఊరట.. రూ.10 కోట్ల బకాయిలు విడుదల!
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని కంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల మార్క్ఫెడ్ ద్వారా రైతులు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన రూ. 10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించి ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు ప్రభుత్వం సేకరించిన 18,194 క్వింటాళ్ల కంది పంటకు గానూ మొత్తం రూ. 14.52 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 3.5 కోట్లు విడుదల చేయగా, రూ. 2.50 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
తాజాగా విడుదలైన రూ. 10 కోట్లతో మార్చి 17 లోపు పంట అమ్ముకున్న రైతులందరికీ లబ్ధి చేకూరనుంది. ఈ నిధులు త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జిల్లా కంది రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.




