చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగిం పు కార్యక్రమం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవలు ప్రశంసనీయమని వైద్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరిండెంట్ డా.విజయ భాస్కర్, డిప్యూటీ డా.డీఎంఅండ్ హెచ్ ఓ విద్యా, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మాాా జ్యోతి రావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈనెల 7వ తేదీన నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా సాధారణ ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి గా అవార్డు అందుకున్న బాన్సువాడ మాత, శిశు సంక్షేమ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని పోచారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమని, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు.




