చిత్రం న్యూస్, బైంసా: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నెరవేర్చేలా చూడాలని ఆశా వర్కర్లు శనివారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను నిర్మల్ జిల్లా బైంసాలోని అయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బీజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి, తాను ఆశ వర్కర్ల తరఫున మాట్లాడనున్నట్లు చెప్పారు. ఆశ వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన వారిలో సంఘ నాయకులతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద మొత్తంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

