ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – మాజీ ఎంపీ సోయం బాపురావు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజా ప్రభుత్వం వేయి రోజుల పాలన అద్భుతమని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వేయి రోజుల్లోనే 72 వేలకు పైగా నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందజేసిందన్నారు. పేదల ఇంట్లో వెలుగులు నింపుతూ 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఉచిత సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీతో రూ.500కే అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల 50 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి చరిత్ర సృష్టించిందని, ఏక కాలంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే అని అన్నారు.
BRS, BJP పార్టీలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంకో రెండు సార్లు 10 ఏళ్ల పాటు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ పరమేశ్వర్, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.