బీజేపీలోకి భారీ చేరికలు: ఆదిలాబాద్ అభివృద్దే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, భోరజ్: జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా భోరజ్ మండలం లేకర్వాడ గ్రామ సర్పంచ్ సంద ప్రభాకర్, ఉప సర్పంచ్, ఇతర వార్డ్ మెంబర్లతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ప్రజలు తనకు సేవ చేసే గొప్ప అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా భోరజ్ నుండి చంద్రపూర్ హైవే వరకు రహదారి విస్తరణ, తరోడ వద్ద హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు సాధించామని, ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
రైతుల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం పోరాడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ‘పొలం బాట’ కార్యక్రమం ద్వారా ప్రతి రైతు పొలానికి రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే, ఫసల్ భీమా పథకం అమలుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
లేకర్వాడ గ్రామం ఆధ్యాత్మికతకు నెలవని కొనియాడుతూ, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ భోరజ్, జైనథ్ మండలాల అధ్యక్షులు గాజుల సన్నీ, లోక కరుణాకర్ రెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




