చిత్రం న్యూస్,అదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్లో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని సేకరించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ (పౌర, వాయుసేన అవసరాల కోసం) అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన సాంకేతిక-ఆర్థిక అధ్యయన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ భూసేకరణకు ఆమోదం తెలిపింది. వరంగల్తో పాటు ఆదిలాబాద్లోనూ బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను రాబోయే రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఏఏఐ యోచిస్తోంది.
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏఏఐ సిద్ధంగా ఉంది. ఆదిలాబాద్ కలెక్టర్ దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్లో పౌర విమాన కార్యకలాపాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

