“రూప్ చంద్” జాతి చేపకు మనిషిని పోలిన పళ్లు
చిత్రం న్యూస్, భైంసా: చేపలకు పళ్లు ఉండటం పెద్ద వింతేమీ కాదు. షార్క్, పిరానా లాంటి వాటికి పదునైన పళ్లు ఉంటాయి. చేపల జాతిలో సగం పళ్లతో ఉంటే.. మరో సగం పళ్లు లేకుండా ఉంటాయి. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే.. కొన్ని చేపలు అచ్చం మనుషుల్లాగే పళ్లను కలిగి ఉంటాయి. అవి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పళ్లు ఉన్న చేపలు కనిపించటం అన్నది అత్యంత అరుదు. అయితే తాజాగా నిర్మల్ జిల్లాలో మనిషిని పోలిన పళ్లు ఉండే చేప ఒకటి కనిపించింది. ఓ మత్స్యకారుడి వలకు ఆ చేప చిక్కింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పడుతుండగా ఓ పెద్ద చేప వలకు చిక్కింది. అది వింతగా కనిపించటంతో బాగా పరిశీలించి చూశాడు. దాని నోట్లో మనిషికి ఉన్నట్లు పళ్లు ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకిపోయింది. జనం వింత చేపను చూడ్డానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేం చేప..గుండ్ల సంతోష్కు చిక్కిన ఆ చేప జాతిని ‘రూప్ చంద్’ లేదా ‘చందువా’ అని పిలుస్తారు. వాటికి చైనీస్ పామ్ఫ్రెట్ అన్న పేరు కూడా ఉంది. ఈ చేపలు ఎక్కువగా ఇండియా, చైనాలో కనిపిస్తాయి. సాధారణంగా ఈ చేపలకు పళ్లు ఉండవు. కానీ, అత్యంత అరుదుగా మనిషి పళ్లను పోలిన పళ్లతో పుడుతూ ఉంటాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రూప్చంద్ చేపలు పిరానా జాతికి బంధువులు. అందుకే అప్పుడప్పుడు పళ్లతో పుడుతూ ఉంటాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మనిషిలాంటి పళ్లు ఉన్న రూప్చంద్ చేప కనిపించింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్మల్ జిల్లాలో పళ్లు ఉన్న చేప వెలుగుచూసింది.




