మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా పత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విసృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరుగగా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకపై అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు తాగి అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు.
నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. ఎక్కడైనా గంజాయి, క్లోరో హెడ్రేట్, డైజోఫామ్, అల్ఫాజోలం వంటి వాటి రవాణా,విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ ఏసీపీ సోమనాథం, ఏ.సీ.పీ ప్రకాష్, ఎక్సెజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఐఈఓ రవికుమార్, ఎంవీఐ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, సైకియాటిస్ట్ డా.రవితేజ తదితరులు పాల్గొన్నారు.

