చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి తెలిపారు. గురువారం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఈ నెల 4 వ తేదీన అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదేరోజు తక్షణమే వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. కానీ ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తూ..చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని రైతులు కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన కొన్నిరోజులు కూడా కాకముందే బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు బాధల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేలాదిమంది రైతులను పొట్టనబెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెక్కడా లేవన్నారు.
పంట నష్టం విషయమై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలిపారు.తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2 వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిచ్ పల్లి మండలం సుద్దపల్లి, ధర్పల్లి లోని రామడుగు,దమ్మన్నపేట,తండాలు,సిరికొండ మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పోసాని శ్రీనివాస్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి,మునిపల్లి సాయి రెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వాసు బాబు, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్,శ్యాంసన్, అంబర్ సింగ్ ఆయా గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

