చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి అమ్మాయి క్యాన్సర్ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార గోడ ప్రతులను శనివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 నుంచి 26 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేస్తుందన్నారు. దీనికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ మద్దతుగా నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ ఎంతో తోడ్పడుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చొరవ తీసుకొని అవగాహన కల్పించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల సురేష్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, దీపక్, మహేష్, కృష్ణ, కార్తీక్, గోపి తదితరులు పాల్గొన్నారు.

