చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లెపూడు తేజస్విని మరణానికి గల కారణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయి. శుక్రవారం అందిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, తేజస్విని అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న తేజస్వినికి ఆర్జీయూకేటీ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, వెంటనే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దురదృష్టవశాత్తూ అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేటున్నాయి. ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థినిని కోల్పోవడం పట్ల యూనివర్సిటీ యంత్రాంగం, తోటి విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


