చిత్రం న్యూస్, ముథోల్:నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద Sub-Mission on Agricultural Mechanization (SMAM) వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేశారు. లోకేశ్వరం, బాసర, ముథోల్, తానూర్ మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు స్ప్రే పంపులు, రోటవేటర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు కార్మిక వ్యయం తగ్గడంతో పాటు సాగు పనులు వేగంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకత పెంపొందించుకోవచ్చని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే చిన్న, మధ్య తరహా రైతులు కూడా ఆర్థికంగా బలపడతారని ఆయన అన్నారు.పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మికుల కొరత వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సబ్సిడీపై అందిస్తోందని తెలిపారు. పరికరాల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన, సాంకేతిక సహాయం కూడా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్.స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.