Chitram news
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 6:14 pm Editor : Chitram news

బాసర ట్రిపుల్ఐటీ అవినీతిపై ఏసీబీ అధికారులతో విచారణ జరపాలని వినతి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ఐటీలో జరిగిన అవినీతిపై,అక్రమ అడ్మిషన్ దందా పైన ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఓ ఎస్ డి. డా.మురళీ ధర్షన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో గత 2018 నుండి 2024 వరకు ఉన్న అధికారులు రూ.వందల కోట్లు విత్ డ్రా చేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై ఈడీ దర్యాప్తునకు కూడా సిఫారసు చేయించి నిందితులని కఠినంగా శిక్షించాలనీ పేర్కొన్నారు. అలాగే గత కొన్నేళ్లుగా గ్లోబల్ సీట్ల పేరుతో ట్రిపుల్ ఐటీ బాసరలో అక్రమ అడ్మిషన్ ల దందా కొనసాగుతుందని, మెరిట్ ను తుంగలో తొక్కి అక్రమంగా కొంతమంది బ్రోకర్స్/కన్సల్టెంట్స్/ఇనిస్టిట్యూషన్ నందలి కింది స్థాయి ఉద్యోగులతో కలిసి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇనిస్టిట్యూట్ కు చెల్లించకుండా ఏండ్ల తరబడి ఫీజులు పెండింగులో పెడుతూ కోట్లలో దందా సాగిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ నిర్ణయించిన (గ్లోబల్ సీట్లకు) ఫీజులకంటే అధికంగా ఫీజులు వసూలు చేసి ప్రతిభ ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తూ, అక్రమార్కులకు కోట్ల దందాలకు అవకాశం ఇస్తున్న గ్లోబల్ సీట్ల ను వెంటనే రద్దు చేసి జనరల్ మెరిట్ సీట్లను పెంచాలని, గ్లోబల్ సీట్ల విషయంలో జరుగుతున్న అక్రమ ఫీజుల దందా పై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కుంట హర్షవర్ధన్, స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్ గంగా ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, విగ్నేష్ ,అక్షయ్ ,మోహన్ మనీ, నాగరాజ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.