తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన భారత్–అమెరికా ఒప్పందం, తెలంగాణ వ్యవసాయ రంగానికి జరుగుతున్న నష్టం అంశాలపై బుధవారం గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పాల్గొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగము పడుతున్న సమస్యలను వివరించారు. పీడీపీఎస్(ప్రైజ్ డెఫిసిటీ పేమెంట్ సిస్టం) అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ మార్కెట్ ను ఎంచుకున్నారని, పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ధరలో వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని చెప్పారు. బియ్యం అమెరికాతో పాటు అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తామని, మిగతా ఉత్పత్తులు ఎక్కువ భాగం అమెరికాకే ఎగుమతి చేయడంతో తాజాగా పన్నుల పెంపుతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా విత్తన వ్యాపార రంగంలో భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ పేరుతో కొత్తగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో, దాని వల్ల కలిగే లాభ–నష్టాలపై , కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్, ఇటీవల జరిగిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రభావం, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

