చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని అధికారులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అధికారులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీజీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శివకుమార్, రామారావు, సలహాదారులు రాజేందర్ దేశ్ పాండే,ఉపాధ్యక్షులు రాజేష్, వామన్ రావు, రజనీకాంత్, సంయుక్త కార్యదర్శులు అనిల్, నరేష్, మహేష్ ప్రచార కార్యదర్శులు సంతోష్, క్రీడల నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు సంతోష్, భగత్ రమేష్, సరోజ,నగేష్ రెడ్డి రమణాచారి పాల్గొన్నారు.