రూ.34,780 ఆర్థిక సాయం అందజేస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ చైర్మన్ బద్దే నాయక్
చిత్రం న్యూస్, కళ్యాణదుర్గం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మరోసారి నిరూపించుకున్నారు.కంబదూరు మండలం పి.వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కరియప్ప అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కరియప్ప అనారోగ్యానికి గురైనప్పటి నుండి అనంతపురం పట్టణంలోని సన్ రే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించామని, ఆర్థిక భారం మితిమీరిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావాలంటే కట్టాల్సిన రూ.34,780 బకాయి చెల్లించలేని స్థితిలో వారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించారు.
స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
కుటుంబ దీనస్థితిని గమనించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తక్షణమే స్పందించింది. ఆసుపత్రి యాజమాన్యం పేరు మీద రూ. 34,780 చెక్కును అందజేసి, బకాయిలను క్లియర్ చేయడమే కాకుండా కరియప్ప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయించి క్షేమంగా ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి, హరీష్, అబ్దుల్ వాహబ్, సభ్యులు తిప్పేస్వామి, మహేష్, రాము, ఓబులేష్, రామాంజినేయులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కరియప్ప కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.

