Chitram news
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 6:57 pm Editor : Chitram news

ఛత్రపతి శివాజీ మహారాజ్  అడుగుజాడల్లో నడవాలి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సుంకిడి లో ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి డప్పు చప్పుళ్ల నడుమ వైభవంగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా శివాజీ మహారాజ్ నిలిచిపోయారన్నారు. శివాజీ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడని,స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడని కొనియాడారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నవతరానికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత ముందుకు వెళుతూ,వారి ఆదర్శాలను అనుసరించాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.