Chitram news
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 6:41 pm Editor : Chitram news

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్,  ఇండస్ట్రియల్ పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా (IAS) తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అధికారులు ప్రాజెక్టులకు సంబంధించిన తాజా నివేదికలను సమర్పించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక అంశాలపై చర్చించారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రైతుల భూముల సేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే అంశాన్ని కలెక్టర్ వివరించారు. రైతులకు నష్టం కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన ఇండస్ట్రియల్ పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం మారిపోతుందని అభిప్రాయపడ్డారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని, తద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.