చిత్రం న్యూస్,ఇచ్చోడ: గ్రామ పొలిమేరల నుండి పట్టణ వీధుల వరకు పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా “కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్” మరియు “కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్” సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన ఒక మహా వృక్షాన్ని “పుడమి తల్లి”గా నామకరణం చేస్తూ, దానిని తమ ‘తల్లి వృక్షం’గా భావించి సంరక్షిస్తామని విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించడం, వృక్షాలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. పల్లె నుండి పట్టణం దాకా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి విద్యార్థి ఒక హరిత సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ కోఆర్డినేటర్ వి.మధు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సరస్వతి విద్యార్థులకు జీవవైవిధ్యం (Biodiversity) యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడుకోవడం ద్వారానే రేపటి తరానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని వారు స్పష్టం చేశారు. వృక్షానికి హారతి ఇచ్చి, పర్యావరణ ప్రతిజ్ఞ చేయడంతో కళాశాల ప్రాంగణమంతా నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతామని ప్రతినబూనారు.

