చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాబోయే పురపాలక ఎన్నికల్లో అన్ని వార్డుల్లో వ్యాపారులు పోటీచేయాలని, తమకు అనుకూలంగా ఉన్న పార్టీల నుండి టికెట్ తీసుకోవడానికి ప్రతిపాదనలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ జిల్లా అధ్యక్షులు క్యాతం శివప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు వ్యాపారస్థులను కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడుకుంటున్నాయని, సత్వర సమస్యల పరిష్కారాల కోసం వ్యాపారులు రాజకీయంలో ఉంటేనే సాధ్యం అవుతుందని అన్నారు. అందుకోసం ఆసక్తి ఉన్న వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయాలనీ, మున్సిపాలిటీ ఎన్నికల్లోపోటీ చేసే వారికి రాజకీయాలకు అతీతంగా సహకారాన్ని ఇస్తామని, వారి గెలుపు కోసం ప్రచారం చేస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆశించిన అభ్యర్థులకు తమ పార్టీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గండ్రత్ సంతోష్, కోశాధికారి పడకంటి సూర్యకాంత్, బొమ్మకంటి బాలాజీ పాల్గొన్నారు

