Chitram news
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:19 pm Editor : Chitram news

ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం-ఎమ్మెల్యే పాయల్ శంకర్

జీపీ బిల్డింగ్ కి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించడం జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ భవనాలు లేని పంచాయితీలకు నూతన భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పొలంబాట కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్లే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రూ.30 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలతో పంచాయితీ భవనాలు, రూ.30 లక్షలతో పొలం బాట మొత్తం రూ.50 లక్షలు మంజూరు చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నూతన సర్పంచులు సైతం పనులను త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.