Chitram news
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 4:36 pm Editor : Chitram news

బేలలో  రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయా వాపస్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన సోయా పంటను ప్రభుత్వం నిరాకరించింది. నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరించారు. మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన రైతు సునీల్ రెడ్డితో పాటు ఇతర రైతుల సోయా మొత్తం 450 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. సొసైటీ అధికారులు మంచి నాణ్యత గల సోయాను కొనుగోలు చేసి మూడు లారీలో దాదాపుగా 220 క్వింటాళ్ల సోయాను లోడింగ్ చేసి జిల్లా కేంద్రానికి పంపించారు. పంట నాణ్యత సరిగా లేదంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరించారు. దీంతో  శుక్రవారం మూడు లారీల్లో దాదాపుగా 220 క్వింటాళ్ళ సోయా బస్తాలను తిరిగి బేల మార్కెట్ యార్డు కు పంపించారు. విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ యార్డ్ కి వచ్చి తమ పంటను చూసి నిరాశ చెందారు. ఈ సందర్బంగా రైతు మాట్లాడుతూ ప్రకృతి కారణంగా పంట నష్టం జరిగితే తామేమి చేయగలమని రైతు వాపోయాడు. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండగా అని,  ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని అంటున్నారు. కానీ రైతులని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తిరిగొచ్చిన సోయా పంటను తాము ఏమి చేయాలంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.