చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ తన హయాంలో ఎన్నో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని ప్రగతి పథాన పయనింపచేసేలా చేసిందని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. భారత రత్న, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించారని కొనియాడారు. భారత్ లో అలీనోద్యమ దేశాల సమావేశంతో పాటు కామన్వెల్త్ దేశాల సమావేశాన్ని కూడా నిర్వహించి తద్వారా భారత దేశ కీర్తిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచిన మహనీయురాలని కీర్తించారు. ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలాల్లో ఆమె చూపిన ధైర్యం, సంకల్పం, నిర్ణయ సామర్థ్యం ఈ తరం మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తాయని, సమానత్వం, స్వయం సమృద్ధి, శక్తివంతమైన భారత్ కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని శాంతన్ రావు, ఎంఏ షకీల్, కందుల సుఖేందర్, రఫీక్, సురేందర్, గౌతమ్ రెడ్డి, అతీఖ్, తౌసీఖ్, బెదోడ్కర్ మోతీరం, తుమ్మ ప్రకాష్, ఖలీల్ ,రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
