చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను ‘స్థానిక’ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది. ఎన్నికలు వాయిదా పడినా, మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

