పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని, విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మరచిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. వారి సేవలను గుర్తుచేసుకుంటూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం అన్నారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణగా నిలిచి పోలీసుశాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, రెండ్ల రాజన్న, షేక్ అలీమ్, సమీఉల్లా ఖాన్, రాజు, మమ్మద్, మన్సూర్ ఖాన్, కొరటి ప్రభాకర్, ఫయీమ్, షేక్ రహిమోదిన్, పోచన్న, షేక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
