బాసరలో మూల నక్షత్రం అక్షరాభ్యాసాలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆలయం నుంచి గోదావరి నది తీరం వరకు ఉన్న వీధి ముంపునకు గురైంది. పలు లాడ్జీల్లోకి వరద నీరు ప్రవేశించింది. అలాగే గోదావరి స్నానపు ఘాట్లు మూసివేశారు. గోదావరిలో పుణ్య స్నానాలకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు. ఏటా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక దర్శన అక్షరాభ్యాస పూజ, క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మూల నక్షత్రం శుభ ముహూర్తం సందర్భంగా ఆలయం తరపున చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఈఓ అంజనీదేవి తెలిపారు. శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం (రేపు) అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఇందుకు దేశ నలుమూలల నుంచి ఇక్కడకు వేలాదిగా భక్తులు తమ పిల్లలను వెంట వేసుకుని వస్తారు. అయితే ప్రస్తుతం గోదావరి లో నీటి ఉధృతి అధికంగా ఉంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారి సర్వ దర్శనానికి , రూ.150ల అక్షరాభాస పూజలకు ఆలయ అతిథి గృహాల నుండి రహదారి పై పోలీస్ స్టేషన్ వైపు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయాల అతిథి గదుల వద్ద ప్రత్యేక రూ.1000 ల అక్షరాభ్యాస పూజ, రూ.100 స్పెషల్ దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
ఆన్ లైన్ లో రూ.1000 టిక్కెట్లు…నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రూ.1000 ల అక్షరాభ్యాస పూజ టికెట్లను అందుబాటులో ఉంచారు. టిపోలియో అప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బయో టాయిలెట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ తరపున రెండు బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.


బాసరలో గోదావరి ఉధృతి..
బాసరలో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నెలరోజుల వ్యవధిలో రెండోసారి లాడ్జీలు, కాటేజీలను వరద ముంచేసింది. గోదావరి వరదలతో శారదీయ నవరాత్రులకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు మూలనక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో గోదావరి వరద ముంచెత్తడంతో.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ ను వరద ముంచేయడంతో నదీ స్నానాలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కాటేజీల్లో ఉన్న భక్తులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి శాంతించు అని భక్తులు కోరుతున్నారు. లేకుంటే భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు భావిస్తున్నారు.

