చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో బుధవారం చంద్రఘంటా అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్రఘంటా అలంకారంలో పులి వాహనంపై జపమాల, కమండలం, విల్లంబులు, ఖడ్గం ధరించి భక్తులకు కనిపించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారినీ భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు తమ చిన్నారులకు అక్షరభ్యాసం పూజలు నిర్వహిస్తే విద్యావంతులుగా రాణిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో, ఆలయ అధికారులు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.

