స్నేహితుల ఉదారత
*మిత్రుడి కుటుంబానికి రూ.60 వేలు, నిత్యవసర సరకులు అందజేత
చిత్రం న్యూస్, ఇచ్చోడ : చిన్నప్పటినుంచి అందరూ కలిసి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ మిత్రులంతా మంచి, చెడులను చర్చించుకునేందుకు ఒక వేదికను ఏర్పరచుకున్నారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్తి విధి వక్రీకరించడంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి చేయూతనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగామ(కే) గ్రామానికి చెందిన బైరీ విలాస్ (40) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి జడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్ మిత్రబృందం ఇచ్చోడలో కలుసుకున్నారు. మిత్రులందరూ తలా కొంత డబ్బులు జమ చేశారు. ఒక క్వింటాన్నర బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు, ఆర్థిక సహాయంగా రూ. 60 వేలు నగదును మృతుడు విలాస్ సతీమణికి అందజేశారు. మేమున్నామంటూ బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. విలాస్ పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుతూ చిత్ర పటానికి నివాళులర్పించారు. గతంలో అకాలంగా మృతి చెందిన భోజన్న, నాగరాజు కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచామని స్నేహితులు తెలిపారు.
