Chitram news
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 11:19 am Editor : Chitram news

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ailamma)  అని, ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆమె చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని గుర్తు చేశారు. కుల వృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేసిందని, చాకలి ఐలమ్మ విసునూరు దొర పెత్తనాన్ని ప్రశ్నించి పోరాడి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర వహించిందన్నారు. తన భర్త, కుమారులు జైలు పాలైన వెనుకడుగు వేయకుండా పోరాటం చేసిందన్నారు. ఇలాంటి మహనీయులను కొందరు విచక్షణ కోల్పోయి అవమాన పరుస్తున్నారని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విగ్రహాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సుంకేట శ్రీనివాస్, సాయినాథ్, గడ్డం భూమన్న, బాబు దళిత సేన నాయకులు యశ్వంత్ బాన్సోడే, రాజు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.