సొనాల పశు వైద్యశాలని పట్టించుకోరా..
*పశు వైద్యశాల ఉన్న ప్రైవేటే గతి
*మందుల కొరతతో గోస పడుతున్న రైతులు
*శిథిలావస్థలో ఆసుపత్రి భవనం
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని పశు వైద్యశాల అలంకార ప్రాయంగా మిగిలింది. డాక్టర్ తో పాటు సిబ్బంది కొరత, మందుల కొరత ఉండటంతో పాడి రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. పశువులకు వింత వ్యాధి (లంఫీ స్కిన్ వ్యాధి ) సోకుతుంది. మూగజీవులకు ఏదైనా జరగరానిది జరిగితే పాడి రైతు కంట కన్నీరే తప్ప చేసేదేం లేకుండా పోతుంది. భవనం కూడా పూర్తిగా శిధిలావస్థలో ఉంది.
అత్యవసర సమయంలో ప్రైవేట్ వైద్యులను సంప్రదించి పశువుల ప్రాణాలను కాపాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు దాదాపు అందరూ జంతు ప్రేమికులే కానీ ఏ రోజు పశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. నెల క్రితం ఇద్దరు రాజకీయ నాయకులు పశువుల ఆసుపత్రి పై శ్రద్ధ వహించి ఉన్నత అధికారులతో మాట్లాడితే రెండు, మూడు రోజులు డాక్టర్ ను పశువైద్యశాలకు పంపించారు. మళ్లీ ఇప్పుడు పాత పరిస్థితే కొనసాగుతుంది. పశు వైద్య శాలలో ఉన్న ఒక్కరే అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి డాక్టర్ తో పాటు సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని సొనాల గ్రామ రైతులు కోరుతున్నారు.




