Chitram news
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 1:34 pm Editor : Chitram news

గణేష్ నిమజ్జోత్సవానికి సర్వం సిద్ధం

బాసరలో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గురువారం నిమజ్జనోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాసర గోదావరి ఏర్పాట్లను గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఏర్పడ్డ గుంతలలో మొరం సైతం వేయించారు. బాసర పరిసరాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గోదావరికి వెళ్లే రహదారుల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేసిన చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.

దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వేళలో దోమల మందు పిచికారి చేస్తున్నారు.  సేకరించిన చెత్తను ఎప్పటికప్పడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తున్న గ్రామస్తులు, వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.