వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు
చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణం మొత్తం జలమయమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రాంగణం వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని, వరద నీటిలో ఉన్న తమ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు వంటి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.