గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటినీ విడుదల చేస్తున్న దృశ్యం
చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 1,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మధ్యాహ్నం సమయానికి క్రమక్రమంగా ఇన్ ఫ్లో పెరిగి 15,400 క్యూసెక్కులకు చేరుకుంది. గురువారం ప్రాజెక్టు నీటి మట్టం 357.9 మీటర్లు, 1.384 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. మధ్యాహ్నం సమయానికి 15వేల క్యూసెక్కుల వరద నీటి చేరికతో ప్రాజెక్టు నీటి మట్టం 358.4కి ఎగబాకింది. వరద నీటి చేరిక పరిస్థితిని అంఛనా వేసిన ప్రాజెక్టు అధికారులు, ఎమ్మెల్యే రామరావ్ పాటిల్ చేతుల మీదుగా రెండు వరద గేట్లను ఎత్తివేసి దిగువకు 8వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్ ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో వరద గేట్ల ద్వారా నీటి విడుదల సైతం పెంచనున్నట్లుగా ప్రాజెక్టు నిర్వాహకా అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ లో మొదటి సారిగా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తివేయడంతో గడ్డెన్న ప్రాజెక్టు సందర్శకుల తాకిడి మొదలైంది. భైంసా వాసులతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు గడ్డెన్న ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.




