*పెచ్చులూడుతున్న స్లాబ్
*ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హాంపోలి గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భయంభయంగా విద్యనభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాల ప్రమాదపుటంచున ఉంది. ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు చెందిన రెండు గదులు, శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పస్తుతం విద్యార్థులు ఉంటున్న గది కూడా స్లాబు పెచ్చులు ఊడుతున్నాయి. దాంతో భయం భయంతో విద్యాబోధన చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పాలకుల మాటలు ఆచరణలో కన్పించడంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో 22 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతికి ఒకే ఒక గది, ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యాబోధన సాగుతుంది. పాఠశాల గోడలు కూడా సగం కూలిపోయి దర్శనమిస్తున్నాయి. నూతన గదులు మంజూరు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి నూతన గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.