ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రాఖీ కడుతున్న మహిళలు
చిత్రం న్యూస్, శ్రీకాకుళం: సోదరీ, సోదరుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షా బంధన్ అని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగింటి ఆడపడచులందరికీ ఆయన రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సోదర భావానికీ, సహోదర తత్వానికీ సోదర, సోదరీమణుల బంధానికీ తార్కాణంగా నిలుస్తోందని, జీవితాంతం ఒక సోదర బంధం అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకునే పండగ అని అన్నారు. రక్తం పంచుకున్న సోదరుల జీవితాల్లో విజయాలు కలగాలని మహిళా మూర్తులందరు ఆకాంక్షిస్తారని, రక్షాబంధన్ పండగ మన సంస్కృతీ,సంప్రదాయానికీ సంబంధిత ఔన్నత్యానికీ నిదర్శనమని తెలిపారు. మహిళా సాధికారత సాధించేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర చర్యలు తీసుకుందని, పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో విస్తృత అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.